![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM
సచివాలయాల్లోనే త్వరలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాల మాదిరిగా పని చేస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేటలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం’ కింద భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. జగన్ చేతుల మీదుగా కొంతమంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘బ్రిటీష్ సివిల్ వ్యవహారాల్లో 90 శాతం భూ వివాదాలే ఉండేవి. అందువల్ల భూ కబ్జాలు జరగకుండా.. రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేసేలా టెక్నాలజీ సహాయంతో సర్వే కార్యక్రమం చేపట్టాం. తొలివిడతలో 2వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తాం. జిల్లాలో ఇచ్ఛాపురంలో ఇప్పటికే కిడ్నీరోగుల కోసం సురక్షిత తాగునీటిని అందించేందుకు రూ.765 కోట్లతో వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని ఇచ్ఛాపురం తెప్పించేందుకు ప్రాజెక్టును తీసుకువచ్చాం. పలాసలో రూ. 50కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వంశధార ప్రాజెక్టులో నేరడి బ్యారేజీ విషయమై ఇప్పటికే ఒడిసా సీఎం నవీన్పట్నాయక్తో మాట్లాడాను. గత ప్రభుత్వాలేవీ ఇటువంటి పనులు చేపట్టలేదు. ఎక్కడా లంచాలు లేకుండా పాలన అందిస్తున్నాం. ఎవరైనా లంచం అడిగితే.. జగనన్న ఉన్నాడన్న భయం ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను, ప్రజల ఆరోగ్యం కోసం విలేజ్ హెల్త్క్లినిక్లను ఏర్పాటు చేశామ’ని తెలిపారు.
Latest News