![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 08:35 AM
బొమ్మణహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపుల వల్ల ఆత్మహత్యకు యత్నించిన ముస్లిం మైనార్టీ కుటుంబంలో మరొకరు బుధవారం చనిపోవడం అత్యంత విషాదమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆవేదన చెందారు. గురువారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పోలీసు వేధింపులతో ముస్లిం కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు ప్రయత్నించగా ఇప్పటికే తల్లీకొడుకు మరణించారన్నారు. మూడో వ్యక్తి కుటుంబ పెద్ద సలీం బళ్ళారి ఆస్పత్రిలో కన్నుమూయడం బాధాకరమన్నారు. ముగ్గురి మరణానికి అసలైన కారకుడేవరన్నది తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి మా కుటుంబాన్ని ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించినందుకే తమ అమ్మ, నాన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకొన్నట్లు బాధిత కుటుంబ సభ్యుడు మహబూబ్ బాషా స్పష్టంగా తెలిపాడన్నారు. అదే రోజు నాలుగైదు గంటలు గడిచాక తిరిగి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడం న్యాయమా? అని కాలవ ప్రశ్నించారు. నిరుపేద మైనార్టీ కుటుంబ మరణాలకు ప్రధాన కారకుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి అని తెలిసి కూడా అతన్ని పోలీసులు రక్షించడం ఏంటన్నారు. అసలు నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు తమ చిత్త శుద్దిని చాటుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు.
Latest News