by సూర్య | Thu, Nov 24, 2022, 08:25 AM
నరసన్నపేట పర్యటనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నారి వైద్య చికిత్సలకు ఉదారత చూపారు. ఇవాళ నరసన్నపేటలో వైయస్ఆర్ జగనన్న భూరక్ష రీసర్వే పత్రాలు పంపిణీ చేసేందుకు వచ్చారు. బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్లో నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పాపను ఎత్తుకున్న తల్లిదండ్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ గమనించి భాదితులను పరామర్శించారు. తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు. తన కుమార్తె ఇంద్రజ (7 సంవత్సరాలు) అనారోగ్య సమస్యను సీఎంకి వివరించిన కృష్ణవేణి, వెంటనే స్పందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేష్ బి లఠ్కర్ చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో చర్చించారు. చిన్నారి ఇంద్రజ ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎక్కడైనా సరే ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం పట్ల వెనువెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి ఆ చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News