దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం

by సూర్య | Thu, Apr 25, 2024, 07:31 PM

'సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి.. ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం' అంటూ ఆలయానికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించడంతో భక్తులు అవాక్కయ్యారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.. స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో కొంతమంది భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.


కొందరు భక్తులు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా అవాక్కయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటి పర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు.


ఇదంతా నిజమని అనుకుంటే పొరపాటే. సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. తాము స్వామి దర్శనానికి వచ్చాం తప్ప చోరీలు చేయలేదని కొందరు భక్తులు కంటతడి పెట్టుకున్నారు. చివరికి ఇదంతా ఉత్సవంలో భాగమని తెలుసుకుని


ఊపిరి పీల్చుకున్నారు.


సింహాచలంలో మంగళవారం రాత్రి దొంగల దోపు వేడుకలో కనిపించకుండా పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టం వినోదోత్సవం బుధవారం ఉదయం జరిగింది. స్వామివారిని ముత్యాల పల్లకీలో అధిష్ఠింపజేసి ఆలయ రాజగోపురం ఎదుట కొలువుదీర్చారు. రక్షక భటుడి వేషధారణలో ఆలయ అలంకారి పురోహితుడు కరి సీతారామాచార్యులు అనుమానితులను బంధీలుగా తీసుకువచ్చారు. వారిని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ విచారణాధికారిగా ప్రశ్నించారు. ఈ ఘట్టాన్ని అత్యంత నాటకీయంగా వినోదాత్మకంగా నిర్వహించారు. తర్వాత స్వామివారి మేలి ముసుగులో ఉంగరం దొరికిందంటూ చూపడంతో ఈ ఉత్సవం ముగిసింది.


స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందు రోజు స్వామివారి అమ్మవారితో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లేటప్పుడు పొరపాటున స్వామివారి ఉంగరం మాయమైపోతుంది. అప్పుడు అమ్మవారు ఉంగరం తీసుకుని వస్తేనే ఇంటికి రమ్మని లేకపోతే రావద్దని అంటారు. దానిలో భాగంగా ఈ వినోదం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. అంతా అయిన తర్వాత స్వామివారి మేలి ముసుగులో ఈ ఉంగరం దొరుకుతుంది. అందుకే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM